3, అక్టోబర్ 2020, శనివారం

కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం

*🌼🌿కదిరి(ఖాద్రి) శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం 🌼🌿*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాలోని కదిరిలో నెలకొని ఉన్న ఆలయం. అహోబిలం కొండమీద వెలసిన నవ నారసింహ రూపాలకు ప్రతీకలుగా శ్రీ నరసింహస్వామి వెలసిన తొమ్మిది క్షేత్రాలను నవనారసింహ క్షేత్రాలు అంటారు. వాటిలో కదిరి ఒకటి. ఇది అనంతపురం జిల్లాలో వున్నది. కదిరిలో శ్రీ నరసింహస్వామికి రెండు ఆలయాలు వున్నాయి. కదిరి పట్టణంలో ఒకటైతే రెండవది అక్కడికి 2 కి.మీ.ల దూరంలో వున్న ఖాద్రి కొండమీద. స్వామి తన పాదం ఈ కొండపై మోపారు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత స్వామిని బ్రహ్మాదులంతా సౌమ్యమూర్తిగా దర్శనమివ్వవలసినదిగా ప్రార్ధించగా స్వామి అంగీకరించి ముందుకు వెళ్ళి ఒక కొండ మీద తన పాదం మోపి, దగ్గరలోనే అర్చామూర్తిగా వెలిశారనీ భక్తుల నమ్మకం. కొండమీద వున్న పాదం స్వామిదనీ, కింద పట్టణంలో అర్చామూర్తి అనీ భక్తులు విశ్వసిస్తారు. సంస్కృతంలో ఖ అంటే విష్ణుపాదం అనే అర్ధం, అద్రి అంటే కొండ అనే అర్ధం. విష్ణు పాదం వుండటం వలన ఈ కొండ ఖ + అద్రి, ఖాద్రి అయింది. వాడుక భాషలో పట్టణం పేరు మాత్రం కదిరి అయినా కొండ మాత్రం ఇప్పటికీ అక్కడివారు ఖాద్రి కొండ అనే అంటారు.

ఈ ప్రాంతంలో పూర్వం వేదవ్యాసుడు వేద ప్రబోధం చేసినందుకు ఈ ప్రాంతానికి వేదారణ్యం అనే పేరు వచ్చింది. ఇక్కడ ఖదిర (చండ్ర) వృక్షాలు అధికంగా వుండటంవలన కూడా ఈ ప్రాంతానికి ఖద్రి అనే పేరు వచ్చిందంటారు. భృగు మహర్షికి మహావిష్ణువు మూడు అర్చామూర్తులు ఇచ్చారని, అవే ఇక్కడి ఉత్సవ మూర్తులనీ భక్తుల నమ్మకం. ఈ మూర్తులే నరహరి, వసంత మాధవుడు, వసంత వల్లభుడు. కదిరి చారిత్రకంగా కూడా ప్రసిధ్ధి చెందిన స్ధలం. ఇక్కడా చాలా శాసనాలు లభించాయి. పదవ శతాబ్దంలో చాళుక్యులు దుర్గాదేవిని ఇక్కడ ప్రతిష్టించారు. ఈ ఆలయమే తర్వాత అమృతవల్లీ తాయారు మందిరంగా చేసారంటారు. హరిహరరాయల కాలంలోనే బ్రహ్మోత్సవం జరిగిన మరునాడు హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించినట్లు శాసనాధారాలున్నాయి.

ఆలయ నిర్మాణం
పూర్వం ఈ ప్రాంత నివాసి అయిన రంగనాయకుడు అనే వ్యక్తికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కలలో కనిపించి పుట్టలో వున్న విగ్రహాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మంచమని చెప్పటంతో ఆయన స్వామి ఆజ్ఞ ప్రకారం ఖాద్రి (చండ్ర) వృక్షం కింద వున్న పుట్టలోంచి స్వామి విగ్రహం తీసి ప్రతిష్టించి, చిన్న ఆలయం నిర్మించి పూజలు చేశారు. తర్వాత 1274లో శ్రీ వీర బుక్కరాయల కాలంలో ఆలయ నిర్మాణ పూర్తయినట్లు శాసనాలద్వారా తెలుస్తున్నది. 2.75 ఎకరాల స్ధలంలో నిర్మింపబడున ఈ ఆలయం చుట్టూ ఎత్తయిన ప్రహరీ గోడలు, నాలుగు వైపులా గోపురాలతో అలరారుతున్నది. ఆలయం చుట్టూ శ్రీ రామచంద్రులవారిదీ, శ్రీ గోవిందరాజస్వామి ఉపాలయాలు, అన్న సత్రాలతోపాటు భక్తులకు వుండటానికి గదులు కూడా వున్నాయి. విశాల ప్రదేశంలో మధ్యలో నిర్మింపబడిన ఆలయం గర్భగృహం, అంతరాలయం, రంగ మండపం అని మూడు భాగాలుగా వున్నది. ఇక్కడ స్వామి లక్ష్మీ సమేతంగా శాంతమూర్తిగా దర్శనమిస్తారు. స్వామి సన్నిధిలో ప్రహ్లాదుడిని కూడా చూడవచ్చు. అంతరాలయానికి ముందున్న స్తంభాలలో మొదటి దానిపై వున్న సంతాన గోపాలస్వామిని సేవిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. స్వామి గర్భగుడి పక్కన వున్న ఉపాలయంలో అమ్మవారు అమృతవల్లీ తాయారు కొలువుతీరారు. ఇది పూర్వం దుర్గాలయమంటారు. అమ్మవారి ఆలయం స్తంభాలపై అద్భుమైన శిల్పకళ చూడవచ్చు.

విశేషాలు
స్వామి మూల విరాట్ కు ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజున అభిషేకం చేస్తారు. అభిషేకం తర్వాత స్వామి మూలవిరాట్టుని తుడుచిన తర్వాత విగ్రహం మీద స్వేద బిందువులు కనబడతాయి. ఇది స్వామివారి మహిమగా భక్తులు భావిస్తారు. పూర్వం ఇక్కడ భృగు మహర్షి తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకున్నారు. ఆ మహర్షి కోరికమేరకు స్వామి స్వయంగా శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ విగ్రహాలను అందించారని కధనం. వీటిని స్వామి వసంత ఋతువులో ప్రసాదించటంవలన ఆయనకి వసంత వల్లభుడనే పేరు వచ్చింది. 15 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో స్వామి వివిధ అవతారాలలో భక్తులకి కనువిందు చేస్తారు. ఉత్సవాలు ప్రతి సంవత్సరమూ సంక్రాంత్రి వేడుకల తర్వాత ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సంక్రాంత్రి సమయంలో పశువుల పండగ రోజు శ్రీ దేవి, భూదేవులతో కలిసి వసంత వల్లభులు కదిరి కొండకు పారువేట నిమిత్తం వస్తారని నమ్మకం. పారు వేట తర్వాత స్వామిని పురవీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోకి తీసుకొస్తారు. దీన్నే రధోత్సవం అంటారు. ఏటా ఫాల్గుణ మాసంలో బహుళ పంచమినాడు ఈ ఉత్సవం జరుగుతుంది. బ్రహ్మోత్సవంలో భాగంగా ఏడో రోజు ఫాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుకుంటారు. ఆ రోజు భక్తులు ఉపవాసం వుంటారు. ఏటా వైశాఖ శుధ్ధ చతుర్దశినాడు నృసింహ జయంతి, వైశాఖ శుధ్ధ పౌర్ణమినాడు మల్లెపూల తిరునాళ , ఆషాఢ శుధ్ధ పొర్ణమి చింత పూల తిరుణాల, శ్రావణ బహుళ నవమి ఉట్ల తిరుణాల, దసరా, వైకుఠ ఏకాదశి వగైరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి రోజు వైఖానసి ఆగమం ప్రకారం పూజలు జరుగుతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి