16, జనవరి 2023, సోమవారం

విక్రమార్కుని కథ

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

              *విక్రమార్కుని కథ:*
                   ➖➖➖✍️

*విక్రమాదిత్య మహారాజు ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది.*

*నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టి వుంటారు.*

*కానీ వాళ్ళంతా రాజులు కాలేదు. నేనే ఎందుకయ్యాను ? గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది?*

*మరుసటి రోజు సభ లో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు.*

*అపుడు ఒక వృద్ధ పండితుడు “రాజా ఈ నగరానికి తూర్పున బయట వున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు. ఆయనను కలవండి. జవాబు దొరుకుతుంది!” అన్నాడు.*

*రాజు వెళ్ళాడు. అపుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు.*

*అది చూసి రాజు ఆశ్చర్యపోయి తన ప్రశ్న ఆయన ముందు పెడితే.... ఆయన అన్నాడు…”ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది. అందులో ఒక సన్యాసి వున్నాడు , ఆయన్ను కలవండి.”*

*నిరాశపడినా, రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు.*

*రాజు ఆయన్ని చూసినపుడు , ఆ సన్యాసి మట్టి తింటున్నాడు. రాజు కాస్త ఇబ్బందిపడ్డాడు.*

*కానీ తన ప్రశ్ననైతే అడిగాడు.*

*కానీ ఆ సన్యాసి, రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపో అని కసురుకున్నాడు.*

 *రాజుకూ కోపం వచ్చినా, సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు.*
*తిరిగి వెళ్ళి పోతుంటే సన్యాసి రాజుతో ఇలా అంటాడు : “ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది.*
*అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు. వెంటనే అతన్ని కలవండి.”*

*రాజుకంతా గందరగోళంగా వుంది. అయినా అక్కడికెళతాడు.*

*చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు.*

*అపుడు ఆ అబ్బాయి అన్నాడు “గత జన్మ లో నలుగురు వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారి తప్పివుంటారు. ఆకలేస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టు క్రింద ఆగివుంటారు. తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి, నీరసంగా వున్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే ఆ నలుగురిలో మొదటివాడు కోపంతో… “నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా?” అని కసురుకొంటాడు.*

*రెండవ వ్యక్తిని అడిగితే..”నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే!” అని వెటకారంగా అంటాడు.*

*మూడవ వాడు…”రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ?” అని నీచంగా మాట్లాడాడు.*

*కానీ నాల్గవ వ్యక్తి మాత్రం ..”తాతా! నీవు చాలా నీరసంగా వున్నావు. ఈ రొట్టె తిను.” అని తాను తినబోతున్న రొట్టెను ఇచ్చేసాడు. ఆ నాల్గవ వ్యక్తివి నువ్వే రాజా!” అని అన్నాడు. *

*రాజు దిగ్భ్రాంతికి లోనయ్యాడు.*

*”రాజా నీ పుణ్యం వల్ల రాజుగా జన్మించావు. అనవసరమయిన మీమాంసలతో కాలం వృథా చేయక ప్రజలను కన్న తండ్రి వలె పాలించు!” అని చెప్పి కనులు మూసినాడు.*

*మంచిమాట-*
 
*దానం సంపద వంటిది. మనకున్న దానిలో కొంత అందరికీ పంచండి. ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది.*

*ఓ చెడ్డ పని అప్పులాంటిది. ప్రతిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి